నాదెండ్ల మనోహర్ పర్యటనకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు: జనసేన

  • కాకినాడ జిల్లాలో తమ కార్యక్రమాలను అడ్డుకున్నారన్న జనసేన 
  • నాదెండ్ల మనోహర్ ను అడ్డుకున్నారని విమర్శ 
  • ఇతర నేతలతో కలిసి రోడ్డుపై మనోహర్ బైఠాయించారని వెల్లడి 
కాకినాడ జిల్లాలో జనసేన నిర్వహిస్తున్న కార్యక్రమాలపై పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారని జనసేన పార్టీ మండిపడింది. తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటనకు ఆటంకాలను కలిగిస్తున్నారని విమర్శించింది. ముమ్మడివరం నియోజకవర్గానికి బయల్దేరిన మనోహర్ ను ముత్తా క్లబ్ దగ్గరే అడ్డుకోవాలని చూశారని... అయితే, ఆయన వాహనాన్ని మినహా మిగిలిన వాహనాలను నిలిపి వేశారని తెలిపింది. ఆ వాహనాలను కూడా వదిలేంత వరకు తాను అక్కడి నుంచి కదలనని మనోహర్ చెప్పడంతో పోలీసులు వెనక్కి తగ్గారని చెప్పింది. 

అయితే కాకినాడ సరిహద్దుల్లో ఆయన వాహన శ్రేణిని పోలీసులు మరోసారి అడ్డుకున్నారని... దీన్ని గమనించిన మనోహర్ తూరంగి వద్ద తన వాహన శ్రేణిని నిలిపివేశారని జనసేన తెలిపింది. ఇతర నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించారని చెప్పింది. ఆ తర్వాత పోలీసులు మరోసారి దిగివచ్చి వాహనాలను వదిలేశారని తెలిపింది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపట్ల నాదెండ్ల మనోహర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని వెల్లడించింది.

Nadendla Manohar
Janasena
Kakinada

More Telugu News